కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు క్రుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదన్నట్లు సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు మాట్లాడుతున్నారు. 

నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) కూడా అలాగే చెపుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీలో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరం కాఫర్ డ్యామ్‌లో కొంత భాగం కొట్టుకుపోతే ఎవరూ ఎందుకు నోరు విప్పడం లేదని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. కాళేశ్వరంని కూలేశ్వరం అంటూ ఎగతాళి చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పోలవరాన్ని కూలవరం?అనగలరా? అని ప్రశ్నించారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో హటాత్తుగా మేడిగడ్డ బ్యారేజి మూడు పియర్స్ క్రుంగడం, 24 గంటల్లోనే ఎన్‌డిఎస్‌ఏ బృందం అక్కడ వాలిపోవడం అనుమానస్పదంగా ఉందన్నారు కేటీఆర్‌. 

మేడిగడ్డ బ్యారేజిలో మూడు పిల్లర్లు క్రుంగితే వెంటనే అక్కడ వాలిపోయిన ఎన్‌డిఎస్‌ఏ పోలవరంలో కాఫర్ డ్యామ్‌ కొట్టుకుపోయినా ఎందుకు స్పందించలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ టన్నల్ కూలినప్పుడు ఎన్‌డిఎస్‌ఏ ఎందుకు స్పందించలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఏపీకి ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా?అని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బీజేపిలు చేస్తున్న కుట్రలను ధీటుగా ఎదుర్కొని ప్రాజెక్టుని కాపాడుకుంటామని కేటీఆర్‌ అన్నారు.