తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడినప్పుడు ప్రకంపనలు సృష్టించింది. కానీ ఆ కేసులో పురోగతి కనిపించకపోవడంతో అటకెక్కిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ ఈ కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులు మాత్రం నిశబ్దంగా తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నారు.
ఈ కేసులో ఇప్పటికే వందల మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులకు నోటీసులు పంపించి వారి వాంగ్మూలాలు తీసుకున్నారు.
నేడు కేంద్ర మంత్రి, బీజేపి ఎంపీ బండి సంజయ్ వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్తో పాటు ఆయన ప్రత్యేక అధికారి (ఓఎస్డీ), పీఏ పసునూరి మధు, బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పోగుల తిరుపతి నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలాలు ఇవ్వనున్నారు.
బండి సంజయ్ తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇదివరకు చాలాసార్లు ఆరోపించారు. ఇప్పుడు ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. కనుక నేడు సిట్ అధికారులకు చెప్పబోయే విషయాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతుంది.
మరి బండి సంజయ్ ఏం బాంబులు పేలుస్తారో? విచారణకు హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత చెపుతారేమో?