పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు? మహేష్ గౌడ్

బీసీ రిజర్వేషన్స్ అంశంపై బీఆర్ఎస్‌ పార్టీ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ తప్పు పట్టారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బీఆర్ఎస్‌ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్స్ పెంచాలనే ఆలోచన చేయలేదు. మా ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేక నిరసనలు, విమర్శలు చేస్తుండటం సిగ్గుచేటు. 

బీఆర్ఎస్‌ పార్టీకి నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే వారి కోసం అది చేయలేకపోయిన పనిని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు మెచ్చుకోవాలి. మెచ్చుకోవాడానికి నోరు రాకపోతే కనీసం మౌనంగా ఊరుకోవాలి. కానీ రోడ్లెక్కి నిరసనలు చేస్తూ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం సిగ్గుచేటు. 

మా పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించి దానికి కట్టుబడి బీసీలకు రిజర్వేషన్స్ పెంచుతుంటే బీఆర్ఎస్‌ పార్టీకి ఎందుకు కడుపు మంట?” అని మహేష్ కుమార్ గౌడ్‌ ప్రశ్నించారు. 

“మా కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ పెంచుతుంటే, కల్వకుంట్ల కవిత దీనిని తన విజయంగా చెప్పుకొని సంబురాలు చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంతకీ ఇప్పుడు ఆమె బీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నారా లేరా?ఆమె చెప్పిన దెయ్యాలు ఇంకా బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నాయి కనుక రాజీనామా చేయకుండా బీఆర్ఎస్‌ పార్టీ భజన ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ కల్వకుంట్లలో కొత్త డ్రామాలు ఏమైనా ఉన్నాయా? అందుకే రాజీనామా చేయడం లేదా?” అని మహేష్ కుమార్ గౌడ్‌ ప్రశ్నించారు.