కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ బీజేపి ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్ధి, విద్యార్ధునులకు 20,000 సైకిళ్ళు పంచిపెట్టబోతున్నారు.
కార్పొరేట్ రెస్పాన్స్బిలిటీ (కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమల సామాజిక బాధ్యత)గా జమా అయిన సొమ్ముతో 20,000 సైకిల్స్ కొనుగోలు చేశారు.
ఈ బాధ్యత నియోజకవర్గంలో విద్యార్ధులను ఎంపిక చేసే బాధ్యతని జిల్లా కలెక్టర్కి అప్పగించగా, ఆయన డీఈవో, ఎంఈవో, ప్రధానోపాద్యాయుల సాయంతో సైకిల్స్ అవసరమున్న పేద విద్యార్ధులను ఎంపిక చేశారు.
దీని కోసం కరీంనగర్ స్టేడియంలో పాఠశాలల వారీగా 21 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బండి సంజయ్ స్వయంగా విద్యార్ధులకు సైకిల్స్ అందజేస్తారు.
కరీంనగర్ నియోజకవర్గంలో మిగిలిన పాఠశాలకు సైకిల్స్ తరలించి అక్కడే విద్యార్ధులకు అందజేస్తారు. ప్రధాని మోడీ కానుకగా బండి సంజయ్ పేద విద్యార్ధులకు సైకిల్స్ అందిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఒకేసారి ఇన్నివేలమంది విద్యార్ధులకి సైకిల్స్ అందించడం ఇదే తొలిసారి. ఇందుకు బండి సంజయ్ని అభినందించాల్సిందే.
ఆయన స్పూర్తితో ప్రజాప్రతినిధులు అందరూ కూడా తమతమ నియోజకవర్గాలలో పేద విద్యార్ధులకు సైకిల్స్ అందజేసి సాయపడవచ్చు. లేదా ప్రభుత్వమే ఏటా 7 లేదా 8వ తరగతిలోకి వచ్చిన పేద విద్యార్ధులకు సైకిల్స్, అవసరమైన వస్తువులు అందజేయగలిగితే విద్యార్ధులకు ఎంతో మేలు చేసినట్లవుతుంది కదా?