మీడియాకు కేటీఆర్‌ హెచ్చరిక

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీడియాకు, ఆ ముసుగులో జర్నలిస్టులుగా చలామణి అవుతున్న కొన్ని శక్తులకు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసుతో తమకు ఎటువంటి సంబందం లేనప్పటికీ, మీడియా ముసుగులో జర్నలిస్టులుగా చలామణి అవుతున్న కొన్ని శక్తులు తన గురించి, కేసీఆర్‌ గరించి పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని అటువంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. 

“టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @ KTRBRS హెచ్చరిక:

అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిక. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారు. 

కావాలని కొన్ని మీడియా సంస్థలు మరియు కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతాము. గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు నా పైన వ్యక్తిగతంగా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషం చిమ్ముతున్నారు. 

అలాంటి వ్యక్తుల వల్ల, వారు వ్యక్తపరుస్తున్న నీచమైన అభిప్రాయాలు నాపైన వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించవు. కానీ పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన మా కుటుంబ సభ్యుల పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయి. 

మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను బాధ కలిగిస్తున్నాయి. వారి ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. 

కలిసికట్టుగా వెనుక ఉండి నడిపిస్తున్న వారితోపాటు, దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటాము,” అని ట్వీట్ చేశారు.