కేటీఆర్‌కి ఏసీబీ నోటీస్.. ఇప్పుడు బిజీ తర్వాత వస్తా!

ఫార్ములా 1 రేసింగ్ కేసు ఆటకెక్కిపోయిందనుకుంటే మళ్ళీ దానిలో చిన్న కదలిక మొదలైంది. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ఈ నెల 28న విచారణకుహాజరు కావాలంటూ ఏసీబీ నోటీస్ పంపింది. 

ఈ విషయం కేటీఆర్‌ స్వయంగా ధృవీకరిస్తూ, “ఈ కేసు రాజకీయ వేధింపులలో భాగమే అయినప్పటికీ, చట్టాన్ని గౌరవించే పౌరుడుగా ఈ కేసు విచారణకు తప్పకుండా హాజరవుతాను. అయితే నేను అమెరికా, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళుతున్నాను కనుక తిరిగి రాగానే విచారణకు హాజరవుతానని ఏసీబీకి తెలియజేశాను. 

తన ప్రత్యర్ధులపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి వెనుకాడని సిఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్-షీట్‌లో తన పేరు పేర్కొనగానే ప్రధాని మోడీ, బీజేపి పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. కానీ  తెలంగాణలో ఏ ఒక్క బీజేపి నేత ఈ మనీలాండరింగ్ కేసు గురించి మాట్లాడలేదు! 

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి పరిపాలన చేతకాని అసమర్ధుడు, పార్టీ నాయకుడు. ఓ మనిషిగా కూడా ఫెయిల్ అయ్యారు. కానీ చవుకబారు రాజకీయ కక్షలలో మాత్రం ఆరి తేరారు. బిఆర్ఎస్ పార్టీని చూసి ఆయన భయపడుతున్నారని నాకు తెలుసు. కనుక ఇలా ప్రయత్నిస్తూనే ఉండండి.. జై తెలంగాణ,” అంటూ ఎక్స్‌ వేదికగా స్పందించారు.