కేసీఆర్‌ కేసు 2 వారాలు.. ఎమ్మెల్యేల కేసు 3 వారాలు!

పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపింది. ఈ నెల 22లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ శాసనసభ కార్యదర్శికి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఇక బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్‌ దాదాపు ఏడాదిగా శాసనసభ సమావేశాలకు రానందున ఆయనపై అనర్హత వేటువేయాలని స్పీకర్‌ని ఆదేశించవలసిందిగా కోరుతూ విజయపాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు,  పిటిషనర్‌ తరపు న్యాయవాది అభ్యర్ధన మేరకు ఈ కేసుని 2 వారాలు వాయిదా వేసింది. అయితే కేసీఆర్‌కి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ విచారణ అర్హత లేదని శాసనసభ కార్యదర్శి తరపు న్యాయవాది వాదించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

కేసీఆర్‌ అనర్హత పిటిషన్‌ కేసులో హైకోర్టు 2 వారాలు వాయిదా వేస్తే, బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. కనుక రెండు కేసులు ఇంచుమించు ఒకేసారి విచారణ పూర్తవుతుందేమో?