మీనాక్షి రాకతో కాంగ్రెస్‌ నేతలు లబోదిబో?

తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంతకాలం దీపాదాస్ మున్షీ ఇన్‌ఛార్జిగా ఉండేవారు. కాంగ్రెస్‌ అధిష్టానం హటాత్తుగా ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమించడంతో ఆమె హైదరాబాద్‌ వచ్చి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు ఊహించని ఈ పరిణామంతో షాక్ అయిన్నట్లు తెలుస్తోంది. 

అంటే మీనాక్షి నటరాజన్‌తో వారికి ఏదో ఇబ్బంది ఉంటుందని కాదు. పదవులు ఆశిస్తున్న నేతలలో కొందరు వాటి కోసం తమని కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద సిఫార్సు చేయాల్సిందిగా కోరుతూ దీపాదాస్ మున్షీకి భారీగా సొమ్ము ముట్టజెప్పారట. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను ఆ పదవి నుంచి తప్పించి మీనాక్షి నటరాజన్‌ని పంపించడంతో తమ సొమ్ము పోయిందని కాంగ్రెస్‌ నేతలు లబోదిబో మంటున్నారట. 

కానీ ఆమెకు డబ్బు ఇచ్చిన్నట్లు ఎవరికీ చెప్పుకోలేరు. ఆమెపై కాంగ్రెస్‌ అధిష్టానానికి పిర్యాదు చేయలేరు. కనీసం నిలదీసి అడుగుదామనుకున్నా ఆమె ఇక్కడ లేరు. ఎప్పుడో ఢిల్లీ వెళ్ళిపోయారు. 

వారి పరిస్థితి ఇలా ఉంటే మరికొందరి పరిస్థితి మరోలా ఉందట! తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జీగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ నీతి నిజాయితీగా ఆర్భాటాలకు దూరంగా చాలా నిరాడంబరంగా ఉంటారు. 

పదవుల కోసం ఆమెను ప్రలోభపెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు లేదా కాంగ్రెస్‌ అధిష్టానానికి వారిపై పిర్యాదు చేస్తూ నివేధిక పంపవచ్చు. కనుక పదవులు ఆశిస్తున్న నేతలు ఆమె రాకతో ఇబ్బంది తప్పేలా లేదు.