బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక, సాగునీటి శాఖల మంత్రి హరీష్ రావు కాంగ్రెస్, బీజేపి, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈరోజు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కేంద్రంలో చాలా పలుకుబడి ఉంది. కనుక ఇష్టారాజ్యంగా నీటిని తరలించుకుపోతున్నారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఇంజనీర్లు అందరూ ఆయనని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా చేతులు ముడుచుకొని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుని పల్లెత్తుమాట అనకుండా రేవంత్ రెడ్డి ఆయన నీటి దోపిడీకి సహకరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు నీటి దోపిడీని అడ్డుకోవడం లేదు. కృష్ణా, గోదావరి బోర్డులు రెండూ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయా లేక చంద్రబాబు నాయుడు అధీనంలో ఉన్నాయో అర్దం కావడం లేదు. ఇకనైనా చంద్రబాబు నాయుడు నీటి దోపిడీని తక్షణం అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రాజెక్టులలో నీళ్ళు లేక ఆయకట్టుల కింద సాగుచేస్తున్న పంటలు ఎండిపోతాయి. హైదరాబాద్ నగరానికి వేసవిలో త్రాగునీరు అందడం కూడా కష్టమైపోతుంది,” అని హరీష్ రావు హెచ్చరించారు.
నదీ జలాలలో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంతో పోరాడేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షం వేస్తే, అందరం కలిసి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ నివాసం ముందు ధర్నా చేద్దామని హరీష్ రావు అన్నారు.