ఎఫ్-1 రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్పై కేసు నమోదు చేయగానే, ఆయన తరపు న్యాయవాదులు శుక్రవారం మద్యాహ్నం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కేటీఆర్పై నమోదు చేసిన కేసుని కొట్టివేయాలని దానిలో కోరారు.
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని పదేపదే చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది కూడా. కనుక అరెస్ట్ అనివార్యమని కేటీఆర్ గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే క్వాష్ పిటిషన్ వేశారు.
భోజన విరామం తర్వాత మద్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. కానీ కేటీఆర్ కోరిన్నట్లు ఈ కేసుని కొట్టేయకపోవచ్చు కానీ ముందస్తు బెయిల్ అడిగితే మంజూరు చేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
ఈ కేసులో కేటీఆర్ని ఏ-1, మున్సిపల్ శాఖ కార్యదర్శిగా చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ-2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ-3గా చేర్చి కేసు నమోదు చేసింది. ఎఫ్1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ విదేశీ సంస్థలకు చట్ట విరుద్దంగా రూ.53 కోట్లు పంపించారని ఏసీబీ ఛార్జ్-షీట్లో పేర్కొంది.
ఈ వ్యవహరంలో విదేశాలకు డబ్బు పంపినందున, ఈరోజు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసి ఏసీబీ నుంచి ఈ కేసుకు సంబందించి అన్ని పత్రాలు, వివరాలు తీసుకుంది. కనుక ఈడీ కూడా వేరేగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.