కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించింది. అందుకు నిరసనగా ఈ నెల 27న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
“ఆనాడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నందుకే సిఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పుడు, బీజేపీతో మేము కుమ్మక్కు అయ్యామని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఏం చెపుతుంది? మోడీని పెద్దన్న అన్నారు కదా? మరి తమ్ముడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి పెద్దనని కలిసి బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేయడం తగదని చెప్పవచ్చు కదా?” అని ట్వీట్ చేశారు.
అయితే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు మరో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నారు. కనుక కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం మేరకే వారు ఈ సమావేశాన్ని బహిష్కరించి ఉండవచ్చు.