తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్షాల మద్య మాటలు పదునెక్కుతున్నాయి. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల ఖాతాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెలకు రూ.2,500 జమా చేస్తోందని అన్నారు.
దీనిపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందిస్తూ, “తెలంగాణలో సుమారు కోటిన్నరకు పైగా 18 ఏళ్ళు వయసు దాటిన ఆడబిడ్డలున్నారు. వారందరూ మీ ప్రభుత్వం నెలకు రూ.2,500 ఎప్పుడు ఇస్తుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కానీ మీ ప్రభుత్వం వారికి ఇప్పటికే ఆ సొమ్ము జమా చేస్తోందని రాహుల్ గాంధీ చేత అబద్దం చెప్పించారు. ఆడబిడ్డలని మోసం చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి చీర కట్టుకుంటారా లేదా రాహుల్ గాంధీ చేత కట్టిస్తారా?” అని ఎద్దేవా చేశారు.
ఇదే విషయం ప్రస్తావిస్తూ ట్విట్టర్లో కూడా కేటీఆర్ ఓ పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానికి రాహుల్ గాంధీ ప్రసంగ వీడియోని జోడించారు. ఈ చీరకట్టుడు ఆక్షేపణపై సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, నేతలు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.