ఓ పక్క బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే, మరో పక్క పార్టీలోని సీనియర్ నేతలు ఒకరొకరుగా రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు.
తాజాగా బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఢిల్లీ నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా కేసీఆర్కు పంపారు.
అనంతరం ఢిల్లీలో తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “నేను 2022లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీలో చేరాను. కానీ ఇప్పుడు పార్టీకి నా అవసరం లేదన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అందువల్లే నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. పార్టీకి ఇక నా అవసరం లేదని అర్ధమైంది కనుక రాజీనామా చేశాను.
శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ తీరు పార్టీలో ఎవరికీ అర్దంకావడం లేదు. ఆయన తన ధోరణి తనదే అన్నట్లు సాగిపోతున్నారు తప్ప పార్టీలో అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను కానీ నా భవిష్యత్ కార్యాచరణ ఇంకా నిర్ణయించుకోలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని భావిస్తున్నాను,” అని అన్నారు.
రాపోలు ఆనంద్ భాస్కర్ మొదట కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరారు. 2022లో బీజేపీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు దానిని వీడి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.