కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా మళ్ళీ లోక్సభకు పోటీ చేస్తున్న బండి సంజయ్ శనివారం జిల్లాలోని కొత్తపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ప్రజలను బురిడీ కొట్టించే వ్యక్తి.
రిజర్వేషన్స్పై రేవంత్ చెపుతున్నావన్నీ అబద్దాలే. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తామని మా పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ అంటే రేవంత్ రెడ్డి మేము ఏకంగా రాజ్యాంగం రద్దు చేసేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.
ఆయనకు రాజ్యాంగ సవరణకు, రాజ్యాంగం పూర్తిగా మార్చడానికి తేడా కూడా తెలీదు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలిస్తున్నప్పుడు అనేకసార్లు రాజ్యాంగ సవరణలు చేసిన సంగతి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి తెలియదా?
బీజేపీలో ఎవరూ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పలేదు. కానీ రేవంత్ రెడ్డి రిజర్వేషన్స్ రద్దు చేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈసారి రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ఎవరైనా అంటే వారిని చెప్పుతో కొట్టండి.
నేను ఎంపీగా కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 12 వేల కోట్లు తీసుకువచ్చాను. మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ కరీంనగర్ కోసం ఏమి చేశారు? కాంగ్రెస్ అభ్యర్ధి ప్రవీణ్ రెడ్డి ఏం చేశారు?
కేంద్రంలో మళ్ళీ రాబోయేది మోడీ ప్రభుత్వమే. కనుక తెలంగాణలో కూడా బీజేపీ అభ్యర్ధులను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలము. కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్ధులకు ఓట్లు వేసి గెలిపించినా వారు ఏమీ చేయలేరు,” అని బండి సంజయ్ అన్నారు.