హరిహర వీరమల్లుకి కొత్తగా మరో దర్శకుడు

పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా టీజర్‌ ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా మెగా సూర్యా ప్రొడక్షన్స్ సంస్థ ఓ ముఖ్య ప్రకటన చేసింది.

అనివార్య కారణాల వలన ఈ సినిమా షూటింగ్‌ చాలా ఆలస్యం అవడంతో, మిగిలిన భాగాన్ని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తారని ప్రకటించింది. కానీ వాటిని కూడా దర్శకుడు క్రిష్ పర్యవేక్షిస్తారని తెలియజేసింది. 

నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ వంటి సినిమాలతో జ్యోతి కృష్ణ రచయిత, దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కనుక ఆయనకు ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యత అప్పగించామని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు.  

ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఇంకా జాక్విలిన్ ఫెర్నాండస్, ఆదిత్య మీనన్, సునీల్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, నోరా ఫతేహీ, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరిలోగా హరిహర వీరమల్లు విడుదల చేస్తామని నేడు టీజర్‌ విడుదల సందర్భంగా ప్రకటించారు.