పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఎట్టకేలకు నేడు టీజర్ విడుదలైంది. దీనికి ‘స్వోర్డ్ వెర్సస్ స్పిరిట్’ అని క్యాప్షన్ జోడించి ఇది ఈ సినిమాకు మొదటి భాగం అంటూ మెగా సూర్య ప్రొడక్షన్ చేసిన ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా సంతోషం కలిగించేదే.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఈ సినిమా ఎప్పటికీ పూర్తవుతుందో అని ఆందోళన చెందుతున్న అభిమానులకు మెగా సూర్య ప్రొడక్షన్ మరో సంతోషకరమైన వార్త కూడా చెప్పింది. ఈ సినిమా 2024లోనే విడుదల కాబోతోందని టీజర్లోనే తెలియజేసింది. అంటే 7-8 నెలల్లో హరిహర వీరమల్లు సినిమా విడుదల కావడం ఖాయమనుకోవచ్చు.
చారిత్రిక నేపధ్యంతో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నిజాం నవాబులు, మొగలులు, బ్రిటిష్ వారు ప్రజలను ఏవిదంగా పీడించేవారో టీజర్లో చూపుతూ, ప్రజల తరపున వారిని ఎదుర్కొని పోరాడే యోధుడిగా హరిహర వీరమల్లు సినిమాని తీస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.