ప్రముఖ తెలుగు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత బుధవారం సాయంత్రం ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె మావగారు రామసహాయం రఘురాం రెడ్డి ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేస్తున్నారు.
ఆశ్రిత తన మావగారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు ఆమె మరిది, రఘురాం రెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి నగరంలోని 23వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేసి, రఘురాం రెడ్డిని గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు.
వెంకటేష్ కుటుంబానికి ఇటు సినిమాలు, అటు రాజకీయలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ వెంకటేష్ ఏనాడూ రాజకీయాల వైపు తొంగి చూడలేదు. తొలిసారిగా ఆయన కుమార్తె కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఖమ్మం నగర ప్రజలు ఆసక్తిగా ఆమెను చూశారు.