రేవంత్‌ ప్రజలను పీడిస్తుంటే మీరేం చేస్తున్నారు మోడీజీ?

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల నుంచి బలవంతంగా ఆర్‌-టాక్స్ వసూలు చేసి ఢిల్లీలో తమ అధిష్టానానికి మూటలు కట్టి పంపిస్తున్నారని మొన్న ప్రధాని నరేంద్రమోడీ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్‌ కంటే ముందు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలను పీడించి డబ్బు వసూలు చేస్తుంటే మరి మీరేం చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే ఈ అక్రమవసూళ్ళని మీరు చూసి చూడన్నట్లు వదిలేస్తున్నారా? తర్వాత మీ డబుల్ ఇంజన్ సర్కారుకు రేవంత్‌ రెడ్డి మద్దతు ఇస్తారనే కదా? అంటూ కేటీఆర్‌ చాలా పెద్ద లేఖ వ్రాశారు. ఆయన ఏమి వ్రాశారో ఆయన మాటల్లోనే...  

గౌరవనీయులైన.. మోదీ గారు.. “ఛోటా భాయ్” అక్రమంగా.. “డబుల్ - R” టాక్స్ వసూలు చేస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు ? మీ రాజకీయ ప్రత్యర్థులపై.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు.. మరి ఛోటా భాయ్ నిర్వాకాన్ని మాత్రం ఎందుకు క్షమిస్తున్నారు?
ఇవాళ ఛోటాభాయ్ అక్రమాలను.. “డబుల్ –R” టాక్స్ వసూళ్లను చూసీ చూడనట్టు వదిలేస్తే... రేపు “డబుల్ ఇంజన్ సర్కారు” ఏర్పాటుకు మీకు సహకరిస్తాడనా? తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా.. బడే భాయ్, ఛోటా భాయ్ ది ఒకే మాట-ఒకే బాట. ఒకరు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును బలిచేయాలని చూస్తుంటే.. మరొకరు తమిళనాడు కోసం తాకట్టుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. 

గోదావరి జలాలను తరలించుకుని పోవాలనేనా కాళేశ్వరంపై ఈ కక్ష..? మీకు, మీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతులపై ఎందుకీ వివక్ష..??

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణకు వచ్చారు... మరి అదే పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకు ఎందుకు పాతరేశారు? పదేళ్లు గడిచినా తెలంగాణ విభజన హక్కులను ఎందుకు కాలరాశారు? అత్యున్నత చట్టసభలో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే... బహిరంగ సభల్లో బీజేపీ వాగ్దానాలను ప్రజలెలా విశ్వసిస్తారు? 

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దెబ్బతీసే.. ఈ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి తెలంగాణ సమాజం సిద్ధం.. !! అచ్చే దిన్, సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అంటూ.. మీరిచ్చిన నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పండి. 

పదేళ్ల బీజేపీ పాలన తరువాత కూడా.. ఉచిత రేషన్ పథకం కింద దేశంలో 80 కోట్ల మంది పేదలు.. ఎందుకు ఉన్నారో వివరించండి.. వికసిత్ భారత్ ఎలా సాధ్యమో సెలవివ్వండి.. మండుతున్న ధరలపైనా.. తీవ్రమవుతున్న నిరుద్యోగంపైనా.. దళితులపై జరుగుతున్న దాడులపైనా.. మైనారిటీల్లో పెరుగుతున్న అభద్రతపైనా.. ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయం..

అవినీతిపరులకు బీజేపీని కేరాఫ్ గా మార్చి.. రాజకీయ ప్రత్యర్థులపై కక్షగట్టి పెడుతున్న కేసులను.. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న అక్రమ అరెస్టులను.. తెలంగాణ ప్రజలే కాదు.. యావత్ భారత సమాజం గమనిస్తోంది.. 

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ కు ఏ దుస్థితి పట్టిందో.. త్వరలో బీజేపీకి కూడా దేశ ప్రజానీకం అదే గుణపాఠం చెప్పి తీరుతుంది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. అదే రాజ్యాంగాన్ని కాలరాయడం భావ్యమా..? అవే రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడం ధర్మమా..? 

నాడు కాంగ్రెస్ పాలనలో దేశం ఎమర్జెన్సీని చూసింది.. నేడు బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీని చవిచూస్తోంది.. ఎన్ని సవాళ్లు ఎదురైనా... ఇంకెన్ని నిర్బంధాలు విధించినా... రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం..! తెలంగాణ హక్కులను కాపాడుకుంటాం..!! 
జై తెలంగాణ జై భారత్ జై బీఆర్ఎస్.