కాంగ్రెస్‌లోకి వస్తే కేసులు... బీజేపీలో ఉంటే కేసులు ఉండవు?

చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వివేకానందపై ఈడీ మనీలండరింగ్ కేసు నమోదు చేయడంపై ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విజయశాంతి తీవ్రంగా స్పందించారు. బిఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని నా వాదనలు నిజమే అని దీంతో మరోసారి నిరూపితమైంది. బిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగానే కేంద్రం ఐ‌టి, ఈడీలను కాంగ్రెస్‌ నేతలపైకి పంపించి కేసులు నమోదు చేయిస్తుంది. అదే... వారు బీజేపీలో ఉంటే వారిపై ఎటువంటి కేసులు ఉండవు. ఉద్యమకారులమైన మేము ఈ కేసులకు భయపడేదే లేదు. కొట్లాడుతాం అని ట్వీట్ చేశారు. 

ఈడీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ని జత చేస్తూ ఆమె ఏమి ట్వీట్ చేశారో ఆమె మాటల్లోనే... “బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని తెలిసిపోతుంది, నేను చెప్పినట్లు అది నిజమని. బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే బీజేపీ ఈడి, ఐటీ పంపిస్తది. బాల్కసుమన్ గారు ఈసీ కి ఫిర్యాదు చేసిన వెంటనే. వివేక్ గారిపై ఐటి , ఈడి రైడ్స్ చేశారు. ఇన్ని రోజులు బీజేపీ లో ఉంటే ఈడి ఐటీ రైడ్స్ ఉండవు. బీజేపీ నుండి బయటకు రాగానే .. ఈడి, ఐటీ దాడులు చేయడం దీనికి సంకేతం. సరే కొట్లాడదాం.. భయపడేది లేదు నేనైనా, @VivekVenkatswam గారైనా, మిగతా ఉద్యమకారులం ఎవరైనా.. హర హర మహాదేవ జై తెలంగాణ” అని విజయశాంతి ట్వీట్ చేశారు.