రైతు వ్యతిరేకినని కాంగ్రెస్‌ నిరూపించుకొందిగా?

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రైతు బంధు పధకం కిండా రైతుల బ్యాంక్ ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ లేఖ వ్రాసింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయే. రేవంత్‌ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు విద్యుత్ చాలంటాడు. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి రైతు బంధు వేస్ట్ అంటాడు,” అని అన్నారు. కేటీఆర్‌ వాదనలు ఆయన మాటల్లోనే.... 

“ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? కాంగ్రెస్ అంటేనే... రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు.

అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి... కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు.

తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. జై కిసాన్.. జై తెలంగాణ..!! జై కేసీఅర్.. జై బీఆర్ఎస్..!!!” అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.