అందరికీ ఒక్క ఫోటో... ఒక్క ట్వీట్‌తోనే సమాధానం!

పవన్‌ కళ్యాణ్‌ జనసేనతో ఏపీ రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నందున ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు అందరూ పదేపదే పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ మానసికంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుంటారు. వైసీపీని మళ్ళీ మరోసారి ఎన్నికలలో గెలిపించే కాంట్రాక్ట్ తీసుకొన్న ప్రశాంత్ కిషోర్‌కి చెందిన ఐప్యాక్ బహుశః వైసీపీ నేతలకు ఈ సలహా ఇచ్చి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల ఉభయగోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నపుడు వైసీపీ నేతలందరూ ప్రధానంగా పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించే ఎక్కువ మాట్లాడారు. బహుశః దానికి కొనసాగింపుగా పవన్‌ కళ్యాణ్‌ తన మూడో భార్య అన్నా లిజినోవాతో కూడా విడాకులు తీసుకొన్నాడని, ఆమె భర్తని విడిచిపెట్టి స్వదేశం (రష్యా)కు వెళ్ళిపోయారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వాటన్నటికీ చెప్పుతో కొట్టిన్నట్లు జనసేన ఒకే ఒక్క ఫోటో... ఒకే ఒక్క ట్వీట్‌తో సమాధానం చెప్పింది. 

 “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు,” అని పవన్‌ కళ్యాణ్‌, అన్నా లెజినోవా దంపతుల ఫోటోని పోస్ట్ చేసింది. దీంతో అందరి నోళ్ళు మూతపడ్డాయి.