
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరటనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించిన సంగతి తెలిసిందే. అదేవిదంగా ఉప్పల్ సర్కిల్ వద్ద పాదాచారుల కోసం రూ.25 కోట్లు వ్యయంతో ఓ స్కైవాక్ కూడా నిర్మించింది. దీనికి మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభోత్సవం చేశారు.
స్కైవాక్ అంటే ఏదో ఫుట్ ఓవర్తో బ్రిడ్జి అని అనుకొంటే పొరపాటే. దీనిలో చాలా ప్రత్యేకతలున్నాయి. మొత్తం 600 మీటర్లు పొండవు, కొన్ని చోట్ల 3 మీటర్లు మరికొన్ని చోట్ల 4,6 మీటర్లు వెడల్పు ఉండేవిదంగా దీనిని నిర్మించారు. ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామాంతపూర్ నలువైపుల నుంచి వచ్చే పాదాచారులు వేరేవైపు చేరుకోవడానికి వీలుగా దీనిని నిర్మించారు.
స్కైవాక్ పైకి చేరుకోవడానికి మెట్లతో బాటు ఎస్కలేటర్లు, లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు. పైనే టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎటువైపు నుంచి పైకిచెరుకొన్నప్పటికీ ఉప్పల్ మెట్రో స్టేషన్లోకి చేరుకొనేవిదంగా నిర్మించారు. స్కైవాక్ రింగ్ రోడ్ చుట్టూ అమర్చిన ఎల్ఈడీ విద్యుత్ దీపాలతో రాత్రిపూట మరింత అందంగా కనిపిస్తుంది.
స్కైవాక్ పాదాచారులకు ఎండ తగలకుండా పైన పరదాలు ఏర్పాటు చేశారు. ఈ పరదాలు వర్షాన్ని ఆపలేకపోవడం పెద్ద లోపంగానే చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో వర్షాలు ప్రారంభం అవుతున్నాయి. కనుక వర్షాకాలంలో స్కైవాక్ మీద నడక కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు.