వచ్చే ఎన్నికల తర్వాత మోడీ, షాలు మళ్ళీ గుజరాత్‌కే!

ఆదివారం చేవెళ్ళలో బిజెపి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ అమిత్‌ షా కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ తీవ్ర విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్స్ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ఇక్కడ తెలంగాణలో బిజెపి, అక్కడ ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం కనబడకుండా పోతాయని, ప్రధాని నరేంద్రమోడీ మళ్ళీ గుజరాత్‌కు వెళ్ళిపోతారని మంత్రి కేటీఆర్‌ జోస్యం చెప్పారు. కారు (బిఆర్ఎస్‌) స్టీరింగ్ మజ్లీస్‌ చేతిలో ఉండటం కాదు... మోడీ ప్రభుత్వ స్టీరింగే అదానీ చేతిలో ఉందన్నారు. కేటీఆర్‌ ఎన్నడూ లేనివిదంగా చాలా సుదీర్గమైన ట్వీట్స్ చేశారు. మోడీ, బిజెపిల గురించి ఆయన ఏమన్నారో ఆయన మాటలలోనే....  

“త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే... త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ... ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో.. వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే.. దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలు కారు స్టీరింగ్ కాదు... బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కింది. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం.. విలవిలలాడుతోంది. 

హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో బీజేపీ ఫుల్ పిక్చర్‌ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు. ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదు తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవు ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా.. ముక్కునేలకు రాసినా... మోకాళ్ల యాత్ర చేసినా... మోసాల మోదీని తెలంగాణ నమ్మదు. 

బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు కరప్షన్‌కు కెప్టెన్... మోదీ క్యాప్షన్... బీజేపీ ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారు? తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ కేంద్ర నిధులు దుర్వినియోగమా ?

బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపికి మిగిలేది బూడిదే! అదానీ విషయంలో JPC కాదు కదా కనీసం SIT కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. గుజరాత్‌లో మోడీ హయాం లో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకులలో గుజరాత్ No: 1గా ఉన్నమాట నిజం కాదా? గత ఎనిమిది ఏళ్లలో గుజరాత్‌లో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా? 

ఈ దేశంలో వ్యాపంలాంటి అతి జుగుప్త్సాకరమైన స్కాం చేసింది మీ BJP పార్టీ ప్రభుత్వం కాదా?? అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడం మీకే చెల్లింది. PM cares లో ఎంత నిజమైంది... ఏ విదంగా ఖర్చు అయ్యిందో చెప్పనివారు ... CAG ఆడిట్ PM cares కు వర్తించదని నిస్సిగ్గుగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసినవారు... CAG మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్‌లతో కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడం.. అవివేకం కాక మరి ఏమిటి?? 

ఎనిమిది ఏళ్లుగా కృష్ణ నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తె నమ్మేదెవరు?” అంటూ ఘాటుగా బదులిచ్చారు.