ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటన నేడే

ప్రధాని నరేంద్రమోడీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకొని 11.55 గంటలకు సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకి పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 నుంచి 1.30 గంటల వరకు సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆయనతో పాటు కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర బిజెపి నేతలు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సభావేదిక మీద నుంచే రిమోట్ విధానంలో రూ.11,000 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించిన తర్వాత ప్రసంగాలు ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. 

ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభించబోయే అభివృద్ధి కార్యక్రమాలు: 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన.

సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులకు ప్రారంభోత్సవం. 

ఎంఎంటిఎస్ రెండోదశ రైళ్ళను ప్రారంభిస్తారు.  

సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ రైల్వే డబ్లింగ్ లైన్ జాతికి అంకితం. 

బీబీ నగర్‌లో ఎయిమ్స్ హాస్పిటల్‌ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన.