నేడు సిఎం కేసీఆర్‌ ఖమ్మం పర్యటన షెడ్యూల్

బుదవారం మధ్యాహ్నం ఖమ్మంలో బిఆర్ఎస్‌ భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభకి సిఎం కేసీఆర్‌, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్‌ మాన్,  కేరళ సిఎం పినరయి విజయన్, యూపీ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరవుతారు. వారి పర్యటన షెడ్యూల్ ఈవిదంగా ఉండబోతోంది. 

కేరళ సిఎం పినరయి విజయన్ మరికొందరు నేతలతో కలిసి హెలికాఫ్టర్‌లో నేరుగా ఖమ్మం చేరుకొంటారు. సిఎం కేసీఆర్‌ మిగిలినవారిని వెంటబెట్టుకొని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 10.10 గంటలకి రెండు హెలికాఫ్టర్లలో యాదాద్రి బయలుదేరుతారు. 

అక్కడ స్వామివారిని దర్శించుకొన్న తర్వాత వారికి కేసీఆర్‌ ఆలయాన్ని చూపిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 11.40 గంటలకి అక్కడి నుంచి హెలికాఫ్టర్లలో బయలుదేరి ఖమ్మం చేరుకొంటారు. వారందరి సమక్షంలో సిఎం కేసీఆర్‌ ఖమ్మం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ‘కంటి వెలుగు’ పధకాన్ని ప్రారంభిస్తారు. కలెక్టరేట్ కార్యాలయంలోనే భోజనం చేసిన తర్వాత అందరూ సభా ప్రాంగనానికి చేరుకొంటారు.  మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బిఆర్ఎస్‌ బహిరంగసభ జరుగుతుంది. అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులూ హెలికాఫ్టర్‌లో విజయవాడ చేరుకొని అక్కడి నుంచి విమానాలలో వారివారి రాష్ట్రాలకి తిరుగుప్రయాణం అవుతారు. సిఎం కేసీఆర్‌ హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌ చేరుకొంటారు.