
తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుంది. కనుక ఆయన స్థానంలో డిజిపిగా కేసీఆర్ ఎవరిని నియమించబోతున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ముగ్గురుఅంజనీ కుమార్, జితేందర్, రవి గుప్తా ఈ పదవికి అన్ని విదాల అర్హులు. కనుక వారిలో ఒకరికి ఈ పదవి లభించవచ్చు. వీరు ముగ్గురూ కాక ప్రస్తుతం హైదరాబాద్ నగర కమీషనర్గా పనిచేస్తున్న సీవీ ఆనంద్ పేరు కూడా పరిశీలనలో ఉంది.
అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు హాస్పిటల్ సిటీ పోలీస్ కమీషనర్, అడిషనల్ డీజీపీగా కూడా పనిచేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ శాంతిభద్రతల డిజిపిగా చేస్తున్న జితేందర్ ఇదివరకు ఎస్పీ, డిఐజీ (గ్రే హౌండ్స్), ఐజి (సిఐడీ), సీబీఐ, అడిషనల్ సిపి (ట్రాఫిక్) వంటి ఉన్నత పదవులను అత్యంత సమర్ధంగా నిర్వహించారు.
ప్రస్తుతం హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా చేస్తున్న రవిగుప్తా కూడా 1990 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరే. ఆయన కూడా డిఐజీ, ఐజీ వంటి అనేక కీలక పదవులలో పనిచేశారు. వీరు ముగ్గురి పేర్లు డిజిపి పదవికి పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మద్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నందున ఒకవేళ ఈ నియామకం ఆలస్యమవుతుందనుకొంటే తాత్కాలికంగా వీరి ముగ్గురిలో ఒకరికి ఇన్ఛార్జ్ డిజిపిగా నియమించే అవకాశం ఉంది.