టీఆర్ఎస్ ఎంపీ నామాకి ఈడీ జలక్... 80.65 కోట్లు జప్తు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి చాలా పెద్ద షాక్ ఇచ్చారు. ఆయనకి చెందిన మధుకాన్ నిర్మాణ సంస్థ రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల్లో చాలా అవకతవకలకు పాల్పడినందుకు చాలా కాలం క్రితమే కేసు నమోదైన సంగతి తెలిసిందే. మధుకాన్ నిర్మాణ సంస్థ రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల కోసమని బ్యాంకు నుంచి రూ. 361.29 కోట్లు అప్పు తీసుకొని దానిని దారి మళ్లించి వేరే అవసరాలకు వాడుకొన్నట్లు ఈడీ అధికారులు ఛార్జ్ షీటులో పేర్కొన్నారు.

ఆ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు కొంతకాలం క్రితం మధుకాన్ నిర్మాణ సంస్థకు చెందిన రూ.73.74 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేశారు. తాజాగా మరో 80.65 కోట్లు విలువగల స్థిరచరాస్తులను జప్తు చేసినట్లు ప్రకటించారు. రెండూ కలిపి మొత్తం రూ.154.39 కోట్లు. అయినప్పటికీ నామా నాగేశ్వరరావుకి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విశేషమే కదా?

మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.1800 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎంపీల వ్యాపారాలు, అక్రమాలు ఈ స్థాయిలో ఉన్నాయి గాబట్టే అందరూ ఆ పదవుల కోసం పోటీ పడుతుంటారు. అక్రమంగా ఇన్ని వందల కోట్లు సంపాదించగల అవకాశం ఉన్నప్పుడు, ఇటువంటి వారు ఎన్నికలలో ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టగలరు కదా? నామాకి ఇంత కెపాసిటీ ఉంది గనుకనే సిఎం కేసీఆర్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించి లోక్‌సభకు పోటీ చేయించారనుకోవాలి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకొని నామా ఘన విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. కానీ ఈ అవినీతి, అక్రమకేసులతో టిఆర్ఎస్‌ పరువుపోతోంది.