తూచ్... మునుగోడులో టిఆర్ఎస్‌ జెండాతోనే పోటీ!


నవంబర్‌ 3వ తేదీన మునుగోడు ఉపఎన్నికలు జరుగనున్నాయి. వాటికి నామినేషన్ల ప్రక్రియ ఈనెల 14వరకు సాగుతోంది. ఆలోగా టిఆర్ఎస్‌ పేరును బిఆర్ఎస్‌గా మార్చుతూ కేంద్ర ఎన్నికల కమీషన్‌ అనుమతించే అవకాశం లేదు. కనుక టిఆర్ఎస్‌ అభ్యర్ధి టిఆర్ఎస్‌ టికెట్‌, పేరు, జెండాతోనే మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేయక తప్పదు. టిఆర్ఎస్‌ సీనియర్ నేత వినోద్ కుమార్‌ నేతృత్వంలో టిఆర్ఎస్‌ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్ళి పార్టీ పేరు మార్పు కోసం కేసీఆర్‌ సంతకం చేసిన దరఖాస్తును ఎన్నికల కమీషన్‌కు సమర్పించారు. అనంతరం వినోద్ కుమార్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “పేరు మార్పు ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కనుక మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ జెండాతోనే పోటీ చేస్తాము . ఎన్నికల కమీషన్‌ గుర్తింపు లభించేవరకు టిఆర్ఎస్‌ యదాతధంగా కొనసాగుతుంది,” అని చెప్పారు.