
కేంద్ర ఎన్నికల కమీషన్ కొద్దిసేపటి క్రితం మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి అదేరోజు నుంచి 14వరకు నామినేషన్లు స్వీకరిస్తుంది. అక్టోబర్ 17వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కించి అదే రోజున ఫలితాలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్లో పేర్కొంది.
మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కానీ టిఆర్ఎస్ అభ్యర్ధి పేరును సిఎం కేసీఆర్ ఇంతవరకు ఖరారు చేయలేదు. నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున కేసీఆర్ కూడా టిఆర్ఎస్ అభ్యర్ధి పేరును ప్రకటించవచ్చు. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ జాతీయపార్టీగా పేరు మార్చుకొని పోటీ చేస్తుందని సిఎం కేసీఆర్ నిన్ననే ప్రకటించారు. కనుక మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్, ఒకవేళ బీఎస్పీ కూడా బరిలో దిగితే నాలుగు జాతీయపార్టీల మద్య పోటీ జరుగుతుంది.