హైదరాబాద్‌లో మత ఘర్షణలు... ఓకే: బండి

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మొన్న కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తన కుమార్తె కల్వకుంట్ల కవితపై వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు రాబోయే రెండు మూడు రోజులలో హైదరాబాద్‌లో అల్లర్లు జరిపించబోతున్నారు. ఇందుకు మజ్లీస్‌ పార్టీని ఆయన వాడుకోబోతున్నారు,”అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

వీటిపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ, ఇదిగో.... బిజెపి నైజాం! “హైదరాబాద్‌లో మత ఘర్షణలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మనసులో మాట వినండి. ఏ కుట్రకు ఈ గుసగుసలు!? వీళ్ళా నాయకులు... ఇలాంటి క్రూర సిద్దాంతాలు కలిగిన పార్టీని ఏం చేయాలో తెలంగాణ సమాజమే ఆలోచన చేయాలి,” అని ట్వీట్ చేశారు. 

బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడేముందు పక్కనే కూర్చోన్న దాసోజు శ్రవణ్ కుమార్‌తో ‘హైదరాబాద్‌లో మత ఘర్షణలు... ఓకే’ అంటూ అంటున్న వీడియోను కూడా రేవంత్‌ రెడ్డి షేర్ చేశారు.