తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

ఈరోజు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ వివరాలు...  

• తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజనులో పండిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. క్వింటాకు రూ.1960 చొప్పున రైతులకు చెల్లిస్తుంది. 

• తెలంగాణలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అవి కావేరి యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, సీఐఐ(కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ) అధ్వర్యంలో యూనివర్సిటీ, గురునాన‌క్‌ యూనివర్సిటీ, నిప్‌మ‌ర్‌ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనిర్సిటీలు.  

• త్వరలో ఫార్మా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది. 

• వికారాబాద్‌ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. అయితే దీని వలన మూసీ, ఈసా నదులు జల కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. దీని కోసం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ త్వరలోనే సమావేశమయ్యి జీవో 111 ఎత్తివేతలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు, తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తల గురించి చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం జీవో 111ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.