విజయశాంతి పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

రాష్ట్రంలో భూములను వేలం వేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బిజెపి మహిళా నాయకురాలు విజయశాంతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వ భూములను కాపాడుకోవడం కష్టంగా ఉందనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం కోకాపేట, ఖానామెట్‌లో విలువైన ప్రభుత్వ భూములను వేలంవేసి అమ్ముకొందని, ఇంకా అమ్ముకొనేందుకు సిద్దం అవుతోందని కనుక వాటిని వేలం వేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజయశాంతి పిటిషన్‌ ద్వారా న్యాయస్థానాన్ని కోరారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ట్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్‌ షావలి కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం భూములను అమ్ముకోకూడదని ఏ చట్టంలోను లేదని కనుక ప్రభుత్వ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని చెపుతూ హైకోర్టు విజయశాంతి వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ప్రభుత్వ భూముల వేలానికి హైకోర్టు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లయింది.