త్వరలో కేసీఆర్‌పై కేంద్రం చర్యలు: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మళ్ళీ సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  బుదవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ అవినీతిని కేంద్రప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగనిస్తోంది. త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకొనేందుకు సిద్దమైంది. కనుక సిఎం కేసీఆర్‌ త్వరలోనే జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఈవిషయం గ్రహించబట్టే సిఎం కేసీఆర్‌ వామపక్ష, విపక్ష నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే సిఎం కేసీఆర్‌ ఎన్ని డ్రామాలు వేసినా కేంద్రప్రభుత్వం విడిచిపెట్టబోదు,” అని హెచ్చరించారు. 

టచ్‌ చేసి చూడు: బండి సంజయ్‌ హెచ్చరికలపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంటనే తీవ్రంగా స్పందిస్తూ, “మోడీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సిఎం కేసీఆర్‌ని టచ్‌ చేసి చూడాలి. ఆయనను టచ్‌ చేస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం అగ్నిగుండంగా మారుతుంది. రాష్ట్రంలో బిజెపిని బండి సంజయ్‌ ఓ సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ ఆదేశిస్తే ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ మా మిత్రపక్షాలకు మద్దతుగా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసి రావడానికి నేను సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.