
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (హెచ్ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్కు కేంద్రం ఆమోదం తెలిపింది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి మీదుగా చౌటుప్పల్ను కలుపుతూ రూ.7,512 కోట్లు వ్యయంతో 158.465 కిమీ పొడవునా నిర్మించబోయే ఈ హెచ్ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్కు కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) చిన్న సవరణతో ఆమోదముద్ర వేసింది. కనుక మరో నెల రోజులలోగా దీని కోసం భూసేకరణ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది..
నాలుగు జిల్లాలు, 15 మండలాల గుండా సాగే ఈ హెచ్ఆర్ఆర్ఆర్ కోసం మొత్తం 120 గ్రామాల నుంచి సుమారు 4,000 ఎకరాలు భూసేకరణ చేస్తారు. దీనికే సుమారు రూ. 1,800 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఈ హెచ్ఆర్ఆర్ఆర్ పరిధిలోకి సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, చౌటకూరు, హట్నూరు, మెదక్ జిల్లాలోని నర్సాపూర్, శివంపేట, తూఫ్రాన్, సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి, భువనగిరి, తుర్కపల్లి,వలిగొండ, చౌటుప్పల్ వస్తాయి. కనుక ఈ మండలాల పరిధిలో గల గ్రామాలలో భూసేకరణ జరుగుతుంది.