ఆకలి చావుల తెలంగాణ అన్నపూర్ణగా మారితే ఈ కష్టాలేమిటి?

ఒకప్పుడు అంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో రైతులు ఎన్ని కష్టాలు, కన్నీళ్లు భరించారో అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు యావత్ దేశానికే కావలసినంత బియ్యం అందించగల స్థాయికి ఎదిగారు. ఈ క్రెడిట్ ఖచ్చితంగా సిఎం కేసీఆర్‌దే. ఆయన ఎంతో దూరదృష్టితో రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ మహాయజ్ఞoలో పాల్గొని తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోటీపడి అధిగమించే స్థాయికి తీసుకువచ్చి నిలిపారు. ఇటువంటి పరిస్థితులలో ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వ వైఖరితో కధ మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. లక్షల టన్నుల ధాన్యం పండితే దానిని కొనే నాధుడే లేకపోవడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఈ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్రంలో రైతులకు ఓ బహిరంగ లేఖ వ్రాశారు. దానిలో... ఒకప్పుడు ఆకలి చావుల తెలంగాణను ఎంతో కష్టపడి అన్నపూర్ణగా మార్చుకొంటే ఇప్పుడు ఈ కొత్త కష్టాలు మొదలయ్యాయి.  ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం ద్వంద వైఖరితో వ్యవహరిస్తోంది. రైతు వ్యతిరేక, మోసపూరితమైన విధానాలు అవలంభిస్తోంది. రా రైస్, బాయిల్డ్ రైస్‌ పేరుతో రైతులను తికమకపరుస్తూ కేంద్రప్రభుత్వం, రాష్ట్రంలో బిజెపి నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. కనుక ముందుచూపుతో ఆలోచించి రాష్ట్రంలో రైతులను అప్రమత్తం చేస్తున్నాము. వచ్చే యాసంగిలో రైతులు వరికి బదులు పత్తి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలను, ఆరుతడి పంటలను మాత్రమే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా రైతులు నష్టపోకుండా తప్పించుకోవచ్చు,” అని ఆయన లేఖ సారాంశం.