ఎక్స్‌ప్రెస్‌ హైవేపై విమానంలో దిగిన ప్రధాని మోడీ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ హైవేను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. దీని కోసం ఆయన వాయుసేనకు చెందిన హెర్క్యులస్‌ సీ-130జే విమానంలో వచ్చారు. విశేషమేమిటంటే, ఆ విమానాన్ని అదే ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ల్యాండ్ చేశారు. యూపీలోని లక్నో నుంచి ఘజియాపూర్‌ను కలుపుతూ నిర్మించిన ఈ 341 కి.మీ. పొడవు గల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్ భారత్‌లో అతి పొడవైన రోడ్‌. దీని ప్రారంభోత్సవం సందర్భంగా వాయుసేనకు చెందిన మీరాజ్, సుఖోయ్, జాగ్వార్, ఏఎన్-32 యుద్ద విమానాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యూపీలో రెండు అతిపెద్ద నగరాలను కలుపుతూ నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ హైవే రాష్ట్ర ప్రజలకీ, వ్యాపారస్తులకు చాలా ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్, సిఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.