దళిత బంధు తక్షణం అమలుచేయాలి: బీజేపీ

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయింది కనుక ఆ నియోజకవర్గంతో సహా రాష్ట్రవ్యాప్తంగా తక్షణం  దళిత బంధు పధకం అమలుచేయాలని లేకుంటే అది ఇచ్చేవరకు ఉద్యమిస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిజెపి నేతలు ఫిర్యాదు చేసినందునే హుజూరాబాద్‌లో దళిత బంధు నిలిచిపోయిందని ఎన్నికల సమయంలో టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది కనుక తక్షణం ఆ పధకాన్ని అమలుచేసి మీ ప్రభుత్వ చిత్తశుద్ధి చాటుకోవాలని బండి సంజయ్‌ సవాల్ విసిరారు. ప్రభుత్వ శాఖలలో 65 వేల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వమే చెపుతున్నందున తక్షణం వాటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని లేకుంటే ఈనెల12న హైదరాబాద్‌లో నిరుద్యోగులతో మిలియ మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. హుజూరాబాద్‌లో నూటికి నూరు శాతం టిఆర్ఎస్‌యే విజయం సాధిస్తుందని సర్వేలు చెప్పాయన్న సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు.