భవిష్యత్ పోరాటాలకు సిద్దంకండి: కేటీఆర్‌

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోవడంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ, “ఈ ఉపఎన్నికలో పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేసిన మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు. అలాగే పార్టీ తరపున సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసిన టిఆర్ఎస్‌ సోషల్ మీడియా వారియర్స్‌కు కూడా కృతజ్ఞతలు,” అని ట్వీట్ చేశారు. 

పార్టీ ఓటమిపై స్పందిస్తూ, “గత 20 ఏళ్ళ టిఆర్ఎస్‌ ప్రస్థానంలో అనేక ఎత్తుపల్లాలను చూశాము. కనుక ఈ ఒక్క ఎన్నిక ఫలితం పార్టీకి అంత ప్రధానమైనది కాదు. పార్టీపై  దాని ప్రభావం ఉండదు,” అని ట్వీట్‌ చేశారు. 

“ఈ ఉపఎన్నికలో గట్టిగా పోరాడిన టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను,” అని మరో ట్వీట్ చేశారు. 

చివరిగా, “టిఆర్ఎస్‌ కార్యకర్తలందరూ మరింత పట్టుదలగా భవిష్యత్‌లో పోరాటాలకు సిద్దం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.