హుజూరాబాద్‌లో రొట్టెల పీటకు 320 ఓట్లు

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన శ్రీకాంత్‌కు ఎన్నికల సంఘం ‘రొట్టెల పీట’ను ఎన్నికల చిహ్నంగా కేటాయించింది. అయితే దానిని ఈవీఎంలో నిక్షిప్తం చేసినప్పుడు టిఆర్ఎస్‌కు చెందిన కారు గుర్తులా కనిపిస్తుండటంతో కొందరు నిరక్షరాస్య ఓటర్లు దానినే కారు గుర్తుగా భావించి ఓట్లేశారనే వాదన మొదలైంది. రొట్టెల పీట గుర్తుతో పోటీ చేసిన శ్రీకాంత్‌కు మొదటి రౌండులో 122 ఓట్లు, రెండో రౌండులో 158, మూడో రౌండులో 40 ఓట్లు పడటమే ఇందుకు నిదర్శనమని టిఆర్ఎస్‌ అభిమానులు వాదిస్తున్నారు. ఈ ఉపఎన్నికలో ప్రతీ ఒక్క ఓటు టిఆర్ఎస్‌కు చాలా కీలకంగా భావిస్తునప్పుడు కారు గుర్తు పోలిన ఇటువంటి ఎన్నికల చిహ్నాల వలన టిఆర్ఎస్‌కు నష్టం కలుగుతోందని టిఆర్ఎస్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్‌కు మూడో రౌండ్‌ ముగిసేసరికి 478 ఓట్లు పోలింగ్‌కు అవగా, రొట్టెల పీట గుర్తుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన శ్రీకాంత్‌కు 320 ఓట్లు పోల్ అవడం విశేషం.