ఎట్టకేలకు మోత్కుపల్లి కల నెరవేరుతోంది

మోత్కుపల్లి నర్సింహులు చిరకాల కోరిక త్వరలో నెరవేరబోతోంది. టిడిపిలో ఉండగానే ఆయన టిఆర్ఎస్‌ వైపు చూస్తుండేవారు. పార్టీ నుంచి బహిష్కరింపబడిన తరువాత టిఆర్ఎస్‌లో చేరేందుకు మళ్ళీ ప్రయత్నించారు కానీ ఫలించకపోవడంతో బిజెపిలో చేరారు. కానీ టిఆర్ఎస్‌లో చేరాలనే ఆయన ఆశ మాత్రం వదులుకోలేదు. అందుకే సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో దళిత సాధికారత సమావేశానికి ఆహ్వానించగానే, బిజెపి దానిని బహిష్కరించినప్పటికీ ఆయన హాజరయ్యారు. అప్పటి నుంచి దళిత బంధు పధకాన్ని...దాన్ని ప్రవేశపెట్టిన సిఎం కేసీఆర్‌ను సమయం చిక్కినప్పుడల్లా పొగుడుతూనే ఉన్నారు. దాంతో సిఎం కేసీఆర్‌ మనసు కరిగిందో ఏమో మోత్కుపల్లిని పార్టీలోకి తీసుకొనేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. సోమవారం తెలంగాణ భవన్‌లో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొని కారెక్కబోతున్నట్లు తాజా సమాచారం.