
క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే పలుకేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ కల్లు వ్యాపారిని డబ్బు కోసం బెదిరిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఫోర్త్ టౌన్ పోలీసులు తీన్మార్ మల్లన్న, ఉప్పు సంతోష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తనను ఉప్పు సంతోష్ రూ.20 లక్షలు, తీన్మార్ మల్లన్న రూ.5 లక్షలు ఇమ్మనమని వేధిస్తున్నారని కల్లు వ్యాపారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉప్పు సంతోష్, తీన్మార్ మల్లన్నలను ఏ-1, ఏ-2 నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్లో ఓ జ్యోతిష్యుడిని డబ్బు కోసం బెదిరించిన ఆరోపణలతో తీన్మార్ మల్లన్న ప్రస్తుతం చంచల్గూడా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసులో జైలు నుంచి విడుదలకాక మునుపే ఆయనపై అటువంటిదే మరో కేసు నమోదయ్యింది.