
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా 8 రాష్ట్రాల హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ప్రస్తుతం ఛత్తీస్ఘడ్ హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. తల్లితండ్రులు ఇద్దరూ విద్యారంగంలో ఉన్నత పదవులలో పనిచేశారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బీఎస్సీ, ఎల్ఎల్బీ చేసారు. ఎల్ఎల్బీలో మూడు సబ్జెక్ట్ లలో డిస్టింక్షన్ సాధించినందుకు మూడు బంగారు పతకాలు అందుకొన్నారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ 1984 నుంచి న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 1993 నుంచి 2003 వరకు అడిషనల్ సెట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ సేవలందించారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010 జనవరిలో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతులు పొందారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఓవైపు న్యాయమూర్తిగా సేవలందిస్తూనే న్యాయశాస్త్రానికి సంబందించి అనేక పుస్తకాలు రచించారు అనేక పరిశోధనాపత్రాలు కూడా ప్రచురించారు.
ఇతర రాష్ట్రాల హైకోర్టులకు కొత్తగా నియమితులైన ప్రధాన న్యాయమూర్తుల వివరాలు:
జస్టిస్ రాజేష్ బిందల్: అలహాబాద్ హైకోర్టు
జస్టిస్ రంజిత్ వి మోరే: మేఘాలయ హైకోర్టు
జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ: కోల్కతా హైకోర్టు
జస్టిస్ ఆర్వి. మలిమత్: మధ్యప్రదేశ్ హైకోర్టు
జస్టిస్ రితురాజ్ అవస్తి: కర్ణాటక హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు:
జస్టిస్ ఏకె గోస్వామి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఛత్తీస్ఘడ్ హైకోర్టుకి
జస్టిస్ ఏఏ ఖురేషీ: త్రిపుర హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టుకి
జస్టిస్ మహమ్మద్ రఫీ: మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి
జస్టిస్ ఇంద్రజిత్ మోహంతి: రాజస్థాన్ హైకోర్టు నుంచి త్రిపుర హైకోర్టుకి
జస్టిస్ బిశ్వనాథ్ సోమద్దర్: మేఘాలయ హైకోర్టు నుంచి సిక్కిం హైకోర్టుకి బదిలీ అయ్యారు.