తీన్‌మార్ మల్లన్నకు బెయిల్‌పై మంజూరు

క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్నకు సికింద్రాబాద్‌ కోర్టు శనివారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 

వారానికి ఒకరోజు చిలకలగూడా పోలీస్‌స్టేషన్‌లో హాజరు వేయించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయరాదని, తన సొంత న్యూస్ ఛానల్లో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, వీడియోలు పెట్టరాదని ఆదేశించింది. మళ్ళీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.     

తీన్‌మార్ మల్లన్నపై సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు, చిలకలగూడా పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో నివశిస్తున్న లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడిని రూ.30 లక్షలు ఇవ్వాలని తీన్‌మార్ మల్లన్న బెదిరించినట్లు ఫిర్యాదు అందడంతో చిలకలగూడా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు రెండు వారాలు రిమాండ్‌పై చంచల్‌గూడా జైలుకు తరలించారు. రిమాండ్ గడువు ముగియడంతో ఆయన తరపు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దరఖాస్తు చేయగా కోర్టు మంజూరు చేసింది.