ప్రధాని మోడీకి సిఎం కేసీఆర్‌ విన్నపాలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ భవన్‌ (టిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం)కు సిఎం కేసీఆర్‌ మొన్న శంఖుస్థాపన చేసిన తరువాత నిన్న శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి సంబందించిన వివిద ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని, విభజన హామీలను అమలుచేయాలని కోరారు. వాటికి సంబందించి 10 వేర్వేరు వినతి పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు. ఈ సందర్భంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని తమ ప్రభుత్వం ఏవిదంగా అభివృద్ధి చేసిందో వివరించి, వచ్చే నెల లేదా నవంబర్‌ మాసంలో కొండపై సుదర్శనయాగం నిర్వహిస్తామని, తప్పక రావాలని ప్రధాని నరేంద్ర మోడీ సిఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు. రాష్ట్రానికి సంబందించి సిఎం కేసీఆర్‌ ప్రధానిని ఏమేమి అడిగారంటే... 

• ఢిల్లీలో ఏపీ భవన్‌కు బదులుగా తెలంగాణ రాష్ట్రానికి వేరేగా తెలంగాణ భవన్‌ నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలి. 

• వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు ఒన్ టైమ్ గ్రాంట్‌గా రూ.1,000 కోట్లు నిధులు ఇవ్వాలి. 

• కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ) ఏర్పాటు చేయాలి.

• విభజన హామీలలో ఒకటైన గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. 

• యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (హెచ్‌సీయూ)లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) ఏర్పాటు చేయాలి. 

• హైదరాబాద్‌-నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలి. 

• రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌కు అనుమతులు ఇవ్వాలి. 

• రాష్ట్రానికి ప్రస్తుతం 139 ఐపీఎస్ అధికారులున్నారు. వారి సంఖ్యను 195కు పెంచాలి. 

• సీనియర్ డ్యూటీ అధికారులను 76 నుంచి 105కు పెంచాలి. 

• తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 21 కొత్త జిల్లాలలో జవహార్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీ)లు ఏర్పాటు చేయాలి. 

• ప్రధాన మంత్రో సడక్ యోజన పధకంలో భాగంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని రోడ్ల వెడల్పు పెంచాలి. 

• విభజన హామీలలో భాగంగా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలలో కొత్త రోడ్లు నిర్మించడానికి నిధులు విడుదల చేయాలి. 

• రాష్ట్రంలో మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వమే 100 శాతం నిధులు సమకూర్చాలి.