
నేడు తెలంగాణతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ శ్రేణులు ‘ఛలో రాజ్భవన్’ పేరిట నిరసన ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఇజ్రాయిల్ రూపొందించిన పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా దేశ ప్రజల, ప్రతిపక్షాల మొబైల్ ఫోన్లు హ్యాకింగ్ గురవుతున్నట్లు బయటకు పొక్కడంతో కాంగ్రెస్ పార్టీ దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా నైతికబాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంటులో కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి.
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు నేడు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఛలో రాజ్భవన్ నిరసన ర్యాలీకి సిద్దం అవుతున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ ర్యాలీకి కూడా పోలీసులు అనుమతించరని భావిస్తున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏవిదంగా విజయవంతం చేయాలనే దానిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జి మానిక్కం ఠాగూర్తో నిన్న చర్చించారు.