రాష్ట్రంలో పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు

బుదవారం సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం.. వ్యవసాయోత్పత్తులు పెరిగినందున రాష్ట్రవ్యాప్తంగా పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, కంపెనీల ఏర్పాటుకు సంబందించి విధివిధానాలు, ప్రోత్సాహాకలపై లోతుగా చర్చించి వాటికీ ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలు:  

• తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీకి ఆమోదముద్ర.

• గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా మొదటిదశలో రాబోయే రెండేళ్ళలో రూ.25,000 కోట్లు పెట్టుబడితో పది ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు. 

• వాటి కోసం మొత్తం 10,000 ఎకరాలు కేటాయింపు. ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కనీసం 500-1,000 ఎకరాలలోపు సకల మౌలిక సదుపాయాలతో ఏర్పాటు.   

• ఈ పాలసీలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో కంపెనీలు ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి (టర్మ్ లోన్) కోసం తీసుకొన్న రుణంపై చెల్లించాల్సిన వడ్డీలో 75 శాతం లేదా రెండు కోట్లకు మించకుండా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తుంది. 

• ఆ పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై ప్రతీ యూనిట్‌కు రూ.2 చొప్పున ఐదేళ్ళపాటు ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంది. 

• ఏడేళ్ళ వరకు మార్కెట్‌ కమిటీ ఫీజుపై 100 శాతం రీయింబర్స్‌మెంట్‌.  

• ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైసు మిల్లులు, బియ్యం, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పువ్వులు తదితర ఉత్పత్తులు, పాలతో డైయిరీ ఉత్పత్తులు, కోళ్ళు, చేపలు, మాంసం తదితర ఉత్పత్తులకు సంబందించిన పరిశ్రమలను ఏర్పాటు చేయబడతాయి. 

• ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు 500 మీటర్ల పరిధిలో జనావాసాలకు, ఎటువంటి నిర్మాణాలకు అనుమతించబడవు. 

• ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మూలధనంలో (రూ.20 లక్షలు మించకుండా) 15% వరకు రాయితీ. దానిపై చెల్లించాల్సిన వడ్డీలో 85% (రూ.2 కోట్లు మించకుండా) రాయితీ. 

• అర్హులైనవారికి కేటాయించిన భూమి ధరలో (రూ.20 లక్షలకు మించకుండా) 33% రాయితీ.

• కోటి రూపాయలకు మించకుండా 15% మూలధనం మంజూరు. 

• , గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా వారికి ప్రభుత్వమే షెడ్లు నిర్మించి ఇస్తుంది. 

• ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వాటిలో పరిశ్రమలు ఏర్పాటుతో పాటు ఉత్పత్తిదారులు, స్వయం సహాయ సంఘాలు, రైతు సంఘాలు, ఎఫ్‌పీవోలకు ఆర్ధిక ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. 

•  ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో పరిశ్రమలు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 31 వరకు గడువు.