మండలి ప్రోటెం ఛైర్మన్‌గా భూపాల్ రెడ్డి

శాసనమండలి ప్రోటెం ఛైర్మన్‌గా టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు ఆయన ప్రోటెం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 

మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి, డెప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం ఒకేసారి నిన్నటితో ముగియడంతో ఈ నియామకం అనివార్యమైంది. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు, ఛైర్మన్‌, డెప్యూటీ ఛైర్మన్‌ల చేత ప్రమాణస్వీకారం చేయించడం, అంతవరకు శాసనమండలి వ్యవహారాలను చూసుకోవడం ప్రోటెం ఛైర్మన్‌ బాధ్యతలు.  

నిన్న గుత్తా, నేతి విద్యాసాగర్‌లతో పాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, ఆకుల లలిత, బోడకుంతి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్‌ల పదవీకాలం కూడా ముగియడంతో వారందరికీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వీడ్కోలు పలికారు.