హైదరాబాద్‌ మెట్రో, టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు కుదింపు

నేటి నుంచి పది రోజులపాటు తెలంగాణలో ఉదయం 10 నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలవుతున్నందున హైదరాబాద్‌ మెట్రో, టీఎస్‌ఆర్టీసీ తమ సర్వీసులను కుదించాయి. 

హైదరాబాద్‌ మెట్రో రైళ్లు ఉదయం 7 నుంచి 9.45 గంటల వరకు మాత్రమే నడుస్తాయి. చివరి రైళ్ళు ఉదయం 8.45 గంటలకు బయలుదేరి 9.45 గంటలకు గమ్యస్థానం చేరుతాయని ఎల్‌అండ్‌టీ మెట్రో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీబీ రెడ్డి తెలిపారు. 

ఇక టీఎస్‌ఆర్టీసీ నేటి నుండి అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తుంది. సిటీ బస్సులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే నడుస్తాయని అధికారులు తెలిపారు. అంతర్ జిల్లా బస్సులు కూడా నాలుగు గంటలలోపుగా అంటే లాక్‌డౌన్‌ మొదలయ్యే లోపుగా గమ్యస్థానాలకు చేరగలిగే సర్వీసులను మాత్రమే నడిపిస్తామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.   

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేట్ బస్సులు కూడా తిరగవు. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ విధించినందున ఈ ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడనుంది.