దాహం వేసినప్పుడు బావి తవ్వడం మొదలుపెట్టినట్లు దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడి నిత్యం అనేకమంది రోగులు చనిపోవడం మొదలైన తరువాత మేల్కొన్న కేంద్రప్రభుత్వం జర్మనీ నుంచి అత్యవసరంగా 23 మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకొంటోంది.
ఈ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఎక్కడికైనా సులువుగా తరలించి వినియోగించుకోవచ్చు. ఇవి ఒక్కోటి గంటకు సుమారు 2,400 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలవని రక్షణమంత్రిత్వశాఖ ప్రతినిధి భరత భూషణ్ చెప్పారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల వద్ద వీటిని ఉంచి ఆక్సిజన్ అందించవచ్చని చెప్పారు. వీటి కొనుగోలు, రవాణాకు సంబందించి లాంఛనాలు పూర్తయ్యాక జర్మనీ నుంచి వీటిని తీసుకువచ్చేందుకు యుద్ధవిమానాలను సిద్దంగా ఉంచాలని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ భారత వాయుసేనను ఆదేశించారు.