2.jpg)
తెలంగాణలో నేటి నుంచి విద్యాసంస్థలు మూసివేయడం, జాతీయ కబడ్డీ పోటీల సందర్భంగా సూర్యాపేట స్టేడియంలోని గ్యాలరీ విరిగి సుమారు 150 మంది గాయపడటంపై బిజెపి మహిళా నేత విజయశాంతి సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే...
“తెలంగాణ సర్కారు ఏ పని చేసినా అరకొరగానే ఉంటుందనడానికి రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్ని చూస్తే అర్థమవుతుంది. విద్యార్థుల్లో కరోనా వ్యాపిస్తున్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. కానీ, మిగిలిన చోట్ల కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారన్నది గమనిస్తే శూన్యం. సూర్యాపేటలో నిన్న అనేకమంది గాయాలపాలైన కబడ్డీ పోటీల నిర్వహణ తీరు చూస్తే ప్రధానంగా రెండు తప్పులను అందరూ ఎత్తి చూపుతున్నారు. ఇక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ తీసుకోలేదు సరి కదా... గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క చోటే కాదు, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కోవిడ్ కట్టడికి తగిన చర్యలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి పరిస్థితి అదుపు తప్పకుండా చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పరిస్థితుల్ని చూసైనా తెలంగాణ సర్కారు మేలుకోకుండా ఈ పాలకుల పాపాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోంది,” అని ఫేస్బుక్లో తీవ్ర విమర్శలు చేశారు.